ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ నుంచి అందిన తాజా వాతావరణ హెచ్చరికలను ప్రజలకు వివరించారు. ఇవాళ ఉభయ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 45 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని ట్వీట్ చేశారు.
ఎండ తీవ్రత అధికంగా ఉండడమే కాకుండా, తీవ్రస్థాయిలో వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించారు. ఈ మేరకు ఆర్టీజీఎస్ నుంచి సమాచారం అందిందని తెలిపారు. ప్రజలు సాధ్యమైనంత వరకు బయట తిరగకుండా ఇంటిపట్టునే ఉండడం మంచిదని తెలిపారు. వేసవి తాప నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా ఈ పరిస్థితి నుంచి ఉపశమనం పొందవచ్చని సూచించారు. మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే ఉండే అవకాశముందని తన ట్వీట్ లో పేర్కొన్నారు.