అనూహ్య పరిణామాల మధ్య గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. ఈ లేఖపై చంద్రబాబు తాజాగా స్పందించారు. రాజీనామా లేఖలో వంశీ పేర్కొన్న అంశాలపై తిరిగి స్పందిస్తూ చంద్రబాబు లేఖ రాశారు. ‘వైసీపీ నాయకులు, కొందరు ప్రభుత్వ అధికారుల వల్ల రాజీనామా చేయడం సబబు కాదని హితవు పలికారు. ప్రజల ప్రయోజనాల కోసం తిరిగి పోరాడాలని.. మీపై పెట్టిన కేసులన్నీ దురుద్దేశంతో కూడినవని చెప్పారు. అర్హత గల పేద ప్రజలకు వారి ఇంటి స్థలాన్ని క్రమబద్ధీకరించడం తప్పేమీకాదన్నారు.
పదవికి రాజీనామా చేయడం లేదా రాజకీయాల నుంచి నిష్క్రమించడం సరైన పరిష్కారం కాదని బాబు అభిప్రాయపడ్డారు. వైసీపీ నాయకుల వైఖరిపై ఎంతవరకైనా పోరాడదాం అని పిలుపునిచ్చారు. రాజకీయాల నుంచి వైదొలగడం వల్ల ఇలాంటివి ఆగవని.. పార్టీ మొత్తం మీకు అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు.