చిత్తూరు: మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో మండలం దేవరాజపురం గ్రామంలో కార్యకర్తలు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. నియోజకవర్గంలో మూడు రోజులపాటు గ్రామాల్లో ఆయన పర్యటించి.. కార్యకర్తలు, ప్రజా సమస్యలు తెలుసుకోనున్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రౌడీయిజం చేయడం ఒక్క నిమిషం పని.. కానీ అది మన విధానం కాదు. కుప్పంలో టీడీపీ కార్యకర్తలు, ప్రజలను ఇబ్బంది పెడుతున్న వారి పేర్లు రాసి పెడుతున్నా.. అందరి లెక్కలు తేల్చుతాం.. నన్ను కూడా బూతులు తిట్టే పరిస్థితికి వచ్చారు.
నేను కుప్పం ముద్దు బిడ్డను.. కుప్పం వదిలి నేను ఎక్కడికి పోనూ.. పార్టీలో కొందరు కోవర్టులు ఉన్నారని , ఎవ్వరినీ వదలను అంటూ హెచ్చరించారు. కుప్పంలో ప్రతీ పల్లె తిరిగి ప్రక్షాళన చేస్తానని అన్నారు..
కుప్పంలో రెండు ఘటనలు బాధించాయని.. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. కుప్పంలో ఓటమిపై అసెంబ్లీలో చేసిన ఎగతాళి ఎంతగానో తనను బాధపెట్టాయని, కుప్పం స్థానిక ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబు ను సభలో చూడాలని జగన్ అన్నాడని చంద్రబాబు నాయుడు ఆవేదన చెందారు.
దోచుకున్న డబ్బులను ఎన్నికల్లో ఓటర్లకు వేలకు వేలు పంచి పెట్టారని ఆరోపించారు. టీడీపీ అలా అనుకుని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని ఈ సందర్భంగా అన్నారు.
సీఎం జగన్రెడ్డి హుందాగా వ్యవహరించాలని చంద్రబాబు హెచ్చరించారు. తన కార్యకర్తపై దెబ్బ పడిందంటే అది తనమీద పడినట్టేనని చంద్రబాబు తెలిపారు. కుప్పంలో ఇకపై కార్యకర్తలు ఎలా చెప్తే అలా చేస్తా” అని చంద్రబాబు మాట ఇచ్చారు.