ఆంద్రప్రదేశ్లో టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు 36 గంటల పాటు నిరసన దీక్ష చేపట్టనున్నారు. నిన్న టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు.. పార్టీ నాయకుడు పట్టాభిరామ్ ఇంటిపై మంగళవారం సాయంత్రం అల్లరిమూకల దాడులు, ఏపీలో పలు చోట్ల తెదేపా కార్యాలయాలపై వైకాపా నాయకులు, కార్యకర్తల దాడులకు వ్యతిరేకంగా రేపు ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు నీరసన దీక్ష కొనసాగనుంది…
కేంద్ర పార్టీ కార్యాలయంలో ధ్వంసమైన వాహనాలు, ఫర్నిచర్ మధ్యలోనే కూర్చొని దీక్ష చేయనున్నారు చంద్రబాబు.. నిన్న జరిగిన పరిణామాలపై పార్టీ ముఖ్యనేతలతో చర్చించిన అనంతరం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీ అలుపెరగని పోరాటం చేస్తోందని, ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరుకు ప్రజలు, ఇతర ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు, పౌర సంఘాలు కలిసి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం” అని తెలుగుదేశం పార్టీ ప్రకటన విడుదల చేసింది.
కాగా తెదేపా అధినేత చంద్రబాబు కేంద్రహోంమంత్రి అమిత్షా అపాయింట్మెంట్ కోరారు. శనివారం దిల్లీ వెళ్లి ఆయన్ను కలిసేందుకు సమయం అడిగారు. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి, రాష్ట్రంలో పరిణామాలపై అమిత్షాకు చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు.