ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నేడు అమరావతిలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటనలో అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. చంద్రబాబు కాన్వాయి పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు, రాళ్లు విసిరారు. ఈ వ్యవహరంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీనే ఈ దాడి చేయించిందంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు. రైతుల ముసుగులో చంద్రబాబుపై దాడి చేయాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు.
చంద్రబాబుపై దాడి చేయాలంటే అమరావతిలోనే చేయాలా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజలను మోసం చేశారు కాబట్టే..వారు రాళ్లు, చెప్పులతో కొడుతున్నారని అన్నారు. సీఎంగా ఉన్నప్పుడు అమరావతిని చంద్రబాబు గాలికొదిలేశారని అన్నారు. బాబుకు ఇప్పుడు బుద్ధి వచ్చినట్టుందని, అందుకే అమరావతిలో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.