వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాజధాని అమరావతి లో భూముల ధరలు పడిపోయాయని టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. భూములు ఇచ్చిన రైతులకు ఇప్పుడు దిగులు పట్టుకుందన్నారు. వైసీపీ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయని ఏపీ ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు సరైనవేనని రాజధాని రైతులు చెబితే తాను దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు.
గతంలో కూడా వైసీపీ నేతలు అమరావతి నిర్మాణానికి అడ్డుపడ్డారని, పంటపొలాలను తగులబెట్టారని, రైతుల్లో కొందరిని రెచ్చగొట్టారని ఆయన ఆరోపించారు. . రాజధానికి వ్యతిరేకంగా ప్రపంచబ్యాంకుకు లేఖలు రాశారని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. గతంలో అమరావతిలో ప్రపంచబ్యాంకు బృందం పర్యటించిందని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. అమరావతి ప్రాజెక్ట్లో ఎలాంటి అవినీతి జరగలేదని ఆయన స్పష్టం చేశారు.రాజధాని అమరావతిపై వైసీపీ ప్రభుత్వ దుర్మార్గమైన నిర్ణయాల కారణంగానే కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.