వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఏపీలో కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు ఆయన కుట్ర పన్నారని ఆరోపించారు. టీడీపీలో, ప్రభుత్వంలో అన్ని కులాలు ఉన్నాయని, కానీ ప్రతిపక్ష నేత జగన్ ఒకే కులానికి వంతపాడుతున్నారని విమర్శించారు. కులాలకు, అధికారులకు సంబంధం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. తమ మంత్రివర్గంలో నలుగురు రెడ్లు ఉన్నారని పేర్కొన్నారు. ఏ కులానికి అన్యాయం జరిగిందో చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు.
ఏపీలో పండుగలా జరుగుతున్న పింఛన్ల పంపిణీ, పసుపు-కుంకుమ చెక్కుల పంపిణీని అడ్డుకునేందుకు జగన్ కుట్ర పన్నారని ఆరోపించారు.జగన్లో శాడిజం పెరిగిపోయిందని, ఆయన పార్టీ సైకో పార్టీగా మారిందని మండిపడ్డారు. ప్రజలు ఎప్పుడూ కష్టాల్లో ఉండాలనేదే వైసీపీ లక్ష్యమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అందుకోసమే రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రాకుండా వైసీపీ అడ్డుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడడం జగన్ శాడిజానికి ప్రత్యక్ష నిదర్శనమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.