ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తననుకర్ణాటకకు రానీయకుండా కేసుపెట్టి జైల్లోపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని చంద్రబాబు అన్నారు. అలాంటి దుర్మార్గుడు నరేంద్రమోదీ అని వ్యాఖ్యానించారు. వాస్తవాలు చెప్పడానికి కర్ణాటక రాష్ట్రానికి వచ్చానని అన్నారు. కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి తరపున ఆదివారం ఆయన శ్రీరామ్నగర్లో ప్రచారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వల్ల ప్రమాదం పొంచి ఉందని అన్నారు. ఈసారి మోదీ గెలిస్తే మనం మీటింగ్లు పెట్టుకోలేమని అన్నారు. ఈ విషయం ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
విభజన హామీల విషయంలో ఏపీకీ మోదీ మోసం చేశారని మండిపడ్డారు. గత 70 ఏళ్లలో ఎన్నడూ జరగనంత అన్యాయం ఇప్పుడు జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లినా న్యాయం జరగలేదని, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. రాజధాని అమరావతి విషయంలో ఎవరు సాయం చేసినా చేయకపోయినా ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేవరకు విశ్రమించబోమని స్పష్టం చేశారు. దేశం గర్వపడేవిధంగా ప్రపంచంలోని ఐదు అగ్రనగరాల్లో అమరావతి కూడా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.