ఏపీ రాజధాని అమరావతిలో నిన్న మాజీ సీఎం చంద్రబాబు పర్యటనలో నిరసన సెగ తగిలిన విషయం తెలిసిందే. చంద్రబాబు కాన్వాయ్ పై కొందరు చెప్పులు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఘాటుగా స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జెడ్ప్లస్ భద్రతలో ఉన్న వ్యక్తి ప్రయాణిస్తున్న బస్సుపై దాడి చేశారని.. డీఎస్పీ సమక్షంలోనే దాడి జరిగినా పోలీసులు చోద్యం చూశారని మండిపడ్డారు.
నిన్న జరిగిన ఘటనపై సీఎం జగన్ ఎందుకు మాట్లాడరని దేవినేని ఉమా ప్రశ్నించారు. రాజధానిలో ఒక్క ఇటుక వేయలేదని ఒక మంత్రి.. శ్మశానం అని మరో మంత్రి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. కొడాలి నానికి బూతుల మంత్రిగా బిరుదు ఇవ్వొచ్చన్నారు. రాజధానిని రక్షించుకునేందుకు వచ్చే నెల 5న రౌండ్టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబుపై జరిగిన దాడి విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని దేవినేని పేర్కొన్నారు.