ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేరస్తులతో పోటీ పడాల్సివుందని జగన్ లక్ష్యంగా ద్వజమెత్తారు. గురువారం పార్టీ నేతలు, కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ప్రతి ఒక్కరూ ప్రత్యర్థుల నేరచరిత్రను గుర్తుంచుకుని వారిని గమనిస్తుండాలని సూచించారు. ప్రతిపక్షం చేసే తప్పుడు పనులను సమర్థంగా ఎదుర్కోవాలని సూచించారు.
అధికారం కోసం ఎంతకైనా దిగజారడానికి వైసీపీ సిద్ధంగా ఉందని విమర్శించారు. రాజధాని అమరావతిలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. చెరుకు పంటలను తగులబెట్టించారని ఆరోపించారు. పాత వీడియోలను, ఫోటోలను మార్ఫింగ్ చేసి, ఎన్నికల వేళ వైరల్ చేస్తున్నారని వారి కుట్ర పూరిత చర్యలకు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. నేరస్తులతో పోరాడాల్సి వున్నందున పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.