telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

లోన్‌ మారటోరియం గడువు పొడిగింపు సాధ్యం కాదు…

Supreme Court

కరోనా మహమ్మారి నేపథ్యంలో విధించిన మారిటోరియం కాలంలో రూ. 2 కోట్ల లోపు తీసుకున్న రుణాలకు వడ్డీ పై వడ్డీ మాఫీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఆ మేరకు సుప్రీంకోర్టులో నిన్న శుక్రవారం రెండవసారి కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. రంగాల వారీగా నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదన్న కేంద్రం…ఆర్ధిక పరమైన విధాన నిర్ణయాలు తీసుకొనేది ప్రభుత్వాలు కానీ, కోర్టులు కాదని రెండవ సారి అఫిడవిట్ లో స్పష్టం చేసింది. రుణాలపై విధించిన మారటోరియంను మరోసారి పొడిగించడం సాధ్యం కాదని అఫిడవిట్ లో పేర్కొంది. మార్చి నుంచి ఆగష్టు వరకు నెలవారి రుణ చెల్లింపులకు వడ్డీ పై వడ్డీ మాత్రమే మాఫీ చేయనున్నట్టు కేంద్రం తెలిపింది.

చిన్న, మధ్య తరహా పరిశ్రమల రుణాలు, విద్యా రుణాలు, గృహరుణాలు, వాహన రుణాలు, క్రెడికార్డుల రుణాలు, వ్యక్తిగత రుణాలు, ఫ్రొఫెషనల్ రుణాలకు వడ్డీ పై వడ్డీ మాఫీ చేయనుంది. మాజీ కంట్రోలర్ ఆండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మహర్షి కమిటీ ఇచ్చిన సూచనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆరునెలల పాటు అన్ని బ్యాంకు రుణాలపై వడ్డీ మాఫీ చేస్తే, బ్యాంకులు కుప్పకూలిపోతాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆలా అన్ని రకాల బ్యాంకు రుణాలపై వడ్డీని మాఫీ చేస్తే సుమారు 6 లక్షల కోట్ల రూపాయల భారాన్ని బ్యాంకులు భరించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది. ఈ పరిణామం చాలా బ్యాంకుల మూలధనం మొత్తం కరిగిపోవడమే కాకుండా, బ్యాంకుల మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది.  దీనిపై వచ్చే మంగళవారం తదుపరి విచారణ కొనసాగనుంది.

Related posts