హైదరాబాద్ తో సహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదలు కలిగించిన నష్టాన్ని అంచనా వేసేందుకు… కేంద్ర బృందం రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తోంది. హైదరాబాద్ చేరుకోగానే ముందుగా సీఎస్ సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులతో సమావేశమైంది… కేంద్ర బృందం. అధిక వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టానికి సంబంధించిన వివరాలను వారికి వివరించారు… అధికారులు. నష్టానికి సంబంధించి ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. మీటింగ్ తర్వాత… ఒక బృందం హైదరాబాద్ పాతబస్తీలో, మరో బృందం సిద్ధిపేట జిల్లాలో పర్యటించాయి. హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణగుట్టలో… ముంపు ప్రాంతాల్ని పరిశీలించింది… ఐదుగురు సభ్యుల కేంద్ర బృందం. అల్జబెల్ కాలనీ, ఘాజీ మిల్లత్, బాబానగర్ వీధుల్లో తిరుగుతూ… వరద బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు… బృంద సభ్యులు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా కేంద్ర బృందాన్ని కలిసి.. పాతబస్తీలో జరిగిన విధ్వంసాన్ని, నష్టాన్ని వివరించారు. మరో కేంద్ర బృందం… సిద్ధిపేట జిల్లా ములుగు మండలంలోని చిన్న తిమ్మాపూర్, అన్నాసాగర్, ములుగు గ్రామాలతో పాటు… మర్కూక్ మండలం, గజ్వేల్ మండలాల్లోని పలు గ్రామాల్లో పంట నష్టాన్ని పరిశీలించింది. వర్షాల కారణంగా దెబ్బతిన్న పత్తి, వరి, కూరగాయ పంటల వివరాలను రైతులను అడిగి తెలుసుకుంది. జిల్లా కలెక్టర్ కూడా కేంద్ర బృందం వెంట ఉండి… జరిగిన నష్టాన్ని వివరించారు.