సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మపై మరోసారి వేటుపడిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో తెలుగు వ్యక్తి మన్నెం నాగేశ్వర్రావుకే మళ్లీ బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ కొత్త డైరెక్టర్ ని నియమించే వరకూ లేదా తుది ఉత్తర్వులు వెలువడే వరకూ నాగేశ్వరరావుకి ఈ అదనపు బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, సీబీఐ కేంద్ర కార్యాలయాన్ని ఢిల్లీ పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తప్పించిన అనంతరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఇలా చేసినట్టు సమాచారం.
సీబీఐ కేంద్ర కార్యాలయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, సీబీఐలో డైరెక్టర్ గా ఉన్న ఆలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ గా ఉన్న రాకేశ్ అస్థానాల మధ్య విభేదాలు తలెత్తడంతో వారిద్దరిని బలవంతపు సెలవుపై కేంద్రం పంపిన సంగతి తెలిసిందే. ఆపై వెంటనే ఒడిశా క్యాడర్ అధికారి మన్నెం నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్ గా నియమించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సీబీఐ డైరెక్టర్ గా అలోక్ వర్మ బాధ్యతలు స్వీకరించారు. రెండు రోజులకే ప్రభుత్వం ఆయనపై ఉన్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని బాధ్యతల నుంచి తప్పించారు.