టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం మరో ఝలకిచ్చింది. జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న మైనింగ్పై కేసు నమోదైంది. మైనింగ్ సంస్థల్లో అక్రమాలు గుర్తించిన అధికారులు జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. అనంతపురం జిల్లా ముచ్చుకోటలో రెండు డోలమైట్ మైనింగ్ క్వారీలను జేసీ దివాకర్ నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ రమణారావు పేర్కొన్నారు. సుమన, భ్రమరాంబ సంస్థల పేరుతో మైనింగ్ నిర్వహిస్తున్న జేసీ దివాకర్రెడ్డి కార్మికుల భద్రతను గాలికొదిలేశారని ఆయన తెలిపారు. మినరల్ మేనేజర్ పర్యవేక్షణలో మైనింగ్ పనులు జరగడం లేదని, నిబంధనలు పాటించని మైనింగ్ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన రెండు క్వారీల్లో ఉల్లంఘన జరిగిందని, ఉన్నతాధికారులకు నివేదిక పంపి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
తమకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ స్పష్టం చేశారు. జేసీ దివాకర్ రెడ్డి పోలీసులకు బహిరంగంగా వార్నింగ్ ఇచ్చిన మరుసటి రోజే ఆయన మైనింగ్ క్వారీలకు సంబంధించి నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. అనంతపురం జిల్లా ముచ్చుకోటలో జేసీ దివాకర్ రెడ్డికి చెందిన క్వారీల్లో మైనింగ్ శాఖ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. మైనింగ్కు సంబంధించి అధికారులు వివరాలు సేకరించారు. దీంతో మైనింగ్ శాఖ కార్యాలయం ఎదుట శుక్రవారం జేసీ దివాకర్ రెడ్డి నిరసనకు దిగారు.అక్కడకు వచ్చిన పోలీసులపై మండిపడ్డారు. తన చుట్టూ పచ్చిరక్తం తాగే రాక్షసులున్నారని, భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారంటూ సీఐని బహిరంగంగా హెచ్చరించారు. అలాగే తనకు అన్నం పెట్టేవి ఈ రెండు క్వారీలేనని, ఇవి కూడా లేకుండా చేస్తే తాము ఆకలితో చావడం ఖాయమని వ్యాఖ్యానించారు. జేసీ ఇలా అన్న మరుసటి రోజే అధికారులు నోటీసులిచ్చారు.