భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్”. సోనియా గాంధీగా జర్మన్ యాక్టర్ సుజానే బెర్నెర్ట్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి విజయ్ రత్నాకర్ గట్టీ దర్శకత్వం వహిస్తుండగా సునీల్ బోహ్రా, జయంతిలాల్ గదా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 11న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. గురువారం ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ లో కశ్మీర్ వివాదం, అణు ఒప్పందం ప్రక్రియలో భాగంగా పార్టీతో ఆయన విభేదించడం వంటి సున్నితమైన అంశాలను కూడా చూపించారు. దీంతో ఈ ట్రైలర్ యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అయ్యింది. అంతేకాదు రాజకీయంగానూ తీవ్ర దుమారాన్ని సృష్టించింది.
తాజాగా సినిమాలో మన్మోహన్ సింగ్ పాత్రలో నటిస్తున్న సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తో పాటు చిత్రయూనిట్ పై బీహార్ న్యాయస్థానంలో సుధీర్ కుమార్ ఓజా అనే న్యాయవాది పిటిషన్ వేశారు. న్యాయస్థానం పిటిషన్ ని స్వీకరించింది. ఈ నెల 8న ఈ పిటిషన్ పై విచారణ జరపనున్నారు. ఈ సినిమాలో మన్మోహన్ సింగ్ పాత్రలో అనుపమ్ ఖేర్, ఆయన సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు పాత్రలో అక్షయ్ ఖన్నా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి పాత్రలలో నటించినవారు వారి పరువు తీస్తున్నారని లాయర్ ఓజా అన్నారు. ఈ సినిమాపై కాంగ్రెస్ నేతలు కూడా గుర్రుగా ఉన్నారు.