తెలంగాణ పోలీసులపై ఆంధ్రప్రదేశ్ లో కేసు నమోదైంది. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. తమ పార్టీ డేటా అపహరించారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదుచేశారు. ఐపీసీ 120బి, 418, 420, 380, 409, 167, 177, 182 రెడ్విత్ 511, ఐటీ యాక్ట్ 66సీ, 67, 70 సెక్షన్ల కింద కేసునమోదు చేశారు.
మరో వైపు ఐటీ గ్రిడ్స్ కేసు విచారణ కోసం సిట్ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై సైబరాబాద్, హైదరాబాద్ రెండు కమిషనరేట్లలోనూ కేసులు నమోదైన నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం హైదరాబాద్ రేంజ్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో సిట్ను ఏర్పాటుచేసింది. సిట్ బృందం గురువారం డీజీపీ కార్యాలయంలో సమావేశమైంది. కేసును అన్ని కోణాల్లో విచారణ చేపట్టడానికి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.