తెలుగుదేశం సీనియర్ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై కేసు నమోదయింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డాడు. ఎన్నికల్లో గెలవాలంటే దాదాపు రూ.50 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తోందని జేసీ చెప్పారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో జేసీ వ్యాఖ్యలపై వైసీపీ, సీపీఐలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఈ ఘటనపై విచారణ జరపాలని ఈసీ జిల్లా కలెక్టర్ ను అప్పట్లో ఆదేశించింది. తాజాగా ఈ వ్యవహారంపై జేసీ దివాకర్ రెడ్డిపై పోలీస్ కేసు నమోదయింది.
గతంలో ఓ మీడియా సమావేశంలో జేసీ మాట్లాడుతూ..‘అనంతపురం లోక్ సభ స్థానంలో తాను, ఇతర ప్రత్యర్థులంతా కలిసి పెట్టిన ఖర్చు రూ.50 కోట్ల వరకూ ఉంటుంది. ఇందులో ఒక పార్టీ ఏక్కువా కాదు, మరో పార్టీ తక్కువా కాదని అన్నారు. అన్ని పార్టీలు కలిసి రూ.50 కోట్లకు తక్కువ కాకుండా ఖర్చు పెట్టాయని పేర్కొన్నారు. ఇది మాకు దినచర్యగా మారిపోయిందిని అభిప్రాయపడ్డారు. తాజాగా ఈ వ్యాఖ్యలపైనే కేసు నమోదయింది.