లోక్ సభ ఎన్నికల ఆరోవిడత ప్రచారం శుక్రవారంతో ముగిసింది. ఆరోవిడతలో భాగంగా దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఉన్న 59 స్థానాలకు ఈ నెల 12న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని 14 స్థానాలతో పాటు హరియాణా(10), బిహార్(8), మధ్యప్రదేశ్(8), పశ్చిమ బెంగాల్(8), ఢిల్లీ(7), జార్ఖండ్(4) రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేసింది.
2014 లోక్సభ ఎన్నికల్లో ఈ 59 స్థానాల్లో 45 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది.అయితే యూపీలో ఎస్పీ–బీఎస్పీ కూటమి బీజేపీ జోరుకు బ్రేకులు వేయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీలోని ఏడు సీట్ల కోసం ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ముక్కోణపు పోటీ ఉండొచ్చని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్, బాక్సర్ విజేందర్ సింగ్, బీజేపీ నేత, కేంద్ర మంత్రి హర్ష వర్ధన్, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్, ఆప్ నేత అతీషీ ఢిల్లీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.