ఇష్టం వచ్చినట్టు పార్టీలు మారిపోతున్నారు నేతలు. దీనితో ప్రచారంలో పొరపాట్లు డొల్లుతున్నాయి. ఒక పార్టీ వాళ్ళు వేరే పార్టీకి జై కొడుతున్నారు. ఇలాంటి విచిత్రాలు రోజు ప్రచారంలో ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా, నోరుజారి సైకిల్ గుర్తుకే ఓటేయాలని చెప్పి, ఆపై నాలిక్కరుచుకున్నారో వైసీపీ నేత. విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది.
పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం జరగడంతో, వైకాపా ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన ఆయన, పొరపాటున సైకిల్ గుర్తుకు ఓటేయాలని పేర్కొన్నారు. దీనితో కంగుతిన్న ఇతర నేతలు, ఆయన్ను అప్రమత్తం చేయడంతో, చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు గౌతమ్ రెడ్డి. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు.