కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కన్నా వ్యాఖ్యలపై మంత్రి బుగ్గన ఘాటుగా స్పందించారు. తాను డైరెక్టర్ గా ఉన్న కంపెనీ ద్వారా కరోనా కిట్లను ప్రభుత్వం కొనుగోలు చేసిందంటూ కన్నా చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అనవసర విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా రాజకీయాలు నడుస్తున్నాయని విమర్శించారు. కరోనా కిట్ల కొనుగోలులో తాను అవినీతికి పాల్పడినట్టు కన్నా నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. రేపు ఉదయం 9 గంటల్లోగా ఆరోపణలను నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. ఒకవేళ నిరూపించలేకపోతే కన్నా తన పదవికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు.