కరోనా వైరస్ నుంచి ప్రజలను రక్షించేందుకు, మందు తయారుచేసేందుకు శాస్త్రవేత్తలు ఉన్నారని, కానీ గత ఎనిమిది నెలలుగా ఏపీ ప్రజలను పట్టిపీడిస్తున్న జగరోనా వైరస్ కు మాత్రం కచ్చితంగా చంద్రబాబే మందు తయారుచేస్తారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నఅన్నారు.
చంద్రబాబుకు తుపానులను నియంత్రించే అతీంద్రయ శక్తులు ఉన్నాయని, ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ కు కూడా ఆయనే మందు కనిపెట్టాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బుద్ధా వెంకన్న ఘాటుగా సమాధానమిచ్చారు.
తుపానులను నియంత్రించగలిగే అతీంద్రయ శక్తులు ఉన్నది ఒక్క వైఎస్ కుటుంబానికేనని, ఈ విషయంలో సీఎం జగన్ తన బావ (బ్రదర్ అనిల్ కుమార్) సాయం తీసుకోవాలని సలహా ఇవ్వండి విజయసాయిగారూ అంటూ బుద్ధా వ్యంగ్యం ప్రదర్శించారు. గతంలో ఆయనకు అనేక విపత్తులు ఆపిన అనుభవం ఉందంటూ బ్రదర్ అనిల్ కు సంబంధించిన ఓ వీడియోను కూడా బుద్ధా ట్వీట్ చేశారు.