టెలికం మార్కెట్లో జియో రంగప్రవేశంతో ప్రైవేటు టెలికం ఆపరేటర్లతోపాటు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా కష్టాల్లో పడింది. క్రమంగా అప్పుల్లో కూరుకుపోయి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులను తగ్గించుకోవడం ద్వారా కష్టాల నుంచి బయటపడాలని యోచిస్తోంది.
సంస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు మూడోవంతు మంది ఉద్యోగులను అంటే 54 వేల మందిని తొలగించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కొన్ని నిబంధనలను సడలించాలని నిర్ణయించింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 58 ఏళ్లకు తగ్గించడం, యాభై ఏళ్లకే స్వచ్ఛంద పదవీ విరమణ అవకాశాన్ని కల్పించడం ద్వారా నిర్ణయాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్లో 1,74,312 మంది పనిచేస్తున్నారు. ఉద్యోగులను తగ్గించుకోవాలన్న తాజా ప్రతిపాదనతో 31 శాతం మంది ఉద్యోగాలు కోల్పోతారు.