జమ్మూకశ్మీర్ లో పుల్వామా తరహా భారీ ఉగ్ర కుట్ర మరొకటి జరగనున్నట్టుగా నిఘావర్గాలు సమాచారం ఇచ్చిన విషయం తెలిసిందే. దీనితో భారీగా సోదాలు చేసిన భద్రతాబలగాలు ఉగ్రమూకల ప్రయత్నాన్ని భగ్నం చేశాయి. షోపియాన్ జిల్లాలోని ఓ ఇంటిలో ఉగ్రవాదులు నక్కినట్లు భద్రతా బలగాలను నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీసుల కాన్వాయ్ లక్ష్యంగా వీరు దాడులకు పాల్పడే అవకాశముందని సమాచారం అందించాయి. వెంటనే అప్రమత్తమయిన బలగాలు ఉగ్రవాదులు నక్కిన ఇంటిపై మెరుపుదాడులు నిర్వహించాయి.
భద్రతాదళాలు హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను భద్రతాబలగాలు సజీవంగా పట్టుకున్నాయి. భూమిలో అమర్చడానికి సిద్ధం చేసిన శక్తిమంతమైన ఐఈడీ(అత్యాధునిక పేలుడు పదార్థం)ని స్వాధీనం చేసుకున్నారు. భద్రతాబలగాలు రాకపోకలు సాగించే రోడ్డుపై ఈ ఐఈడీని అమర్చేందుకు ఉగ్రమూకలు కుట్ర పన్నాయని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పక్కా నిఘా సమాచారంతో ఈ కుట్రను భగ్నం చేశామని పేర్కొన్నారు.