హైదరాబాద్ నగరంలో బ్రెయిన్ స్ట్రోక్ సమస్య పెరుగుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. బాధితుల్లో 30శాతం మంది శాశ్వత వైకల్యానికి గురవుతున్నారు. ఈ స్ట్రోక్ బాధితుల్లో 30-45 ఏళ్ల మధ్య యువత 15శాతం వరకు ఉంటున్నారని వైద్యులు అంటున్నారు. ఒకప్పుడు 70 యేళ్ళ వయస్సు గలవారికి వచ్చే ఈ వ్యాధి… మారుతున్న జీవన విధానం ఒత్తిడి, జన్యుపరమైన కారణాలతో చిన్న వయసులోనే ఈ వ్యాధి వ్యాపిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. రక్తనాళాల్లో ఏర్పడే వైఫల్యం కారణంగా..రక్తం గడ్డ కట్టడం ద్వారా అవి పూర్తిగా లేదా పాక్షికంగా మూసుకుపోతాయి. మెదడుకు రక్త సరఫరా సక్రమంగా జరగకపోయినా స్ట్రోక్ వస్తుంది.
తాత్కాలిక ఉపశమనం కోసం కొందరు ధూమపానం, మద్యపానం, ఇతర మత్తు మందులకు అలవాటు పడుతున్నారు. వీటికి బానిసలుగా మారడంతో నాడీ వ్యవస్థని ఇవి దెబ్బతీస్తున్నాయి. చాలామంది బయట ఆహారం తీసుకుంటున్నారు. ఇందులో ఎక్కువ శాతం కొవ్వులు శరీరంలోకి చేరుతున్నాయి. ఎలాంటి శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల చివరికి అధిక బరువుకు దారితీస్తోంది. అధిక కొవ్వులతో ఊబకాయం తలెత్తి అధిక రక్తపోటు, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. చెడు కొలస్ట్రాల్ పెరుగుతోంది. ఇవన్నీ కలిసి చివరికి బ్రెయిన్ స్ట్రోక్ దశకు చేరుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.