telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సినిమాలు చూసి కిడ్నప్ చేసిన అఖిల ప్రియ..?

ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో సూత్రాధారిగా తేల్చారు పోలీసులు.. అయితే, ఈ కేసులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. సినిమా తరహాలో కిడ్నాప్‌కు అఖిలప్రియ గ్యాంగ్‌ ప్లాన్‌ చేసినట్టు పోలీసుల ఎంక్వయిరీలో తేలింది. అక్షయ్‌ కుమార్‌ నటించిన స్పెషల్‌ చబ్బీస్‌ మూవీ సీన్లను చూపించి.. కిడ్నాప్‌ ఎలా చేయాలి? ఐటీ అధికారులుగా ఎలా నటించాలి? అని రిహార్సల్స్‌ కూడా చేసుకున్నారు. దాదాపు వారం రోజుల పాటు భార్గవ్‌ సోదరుడు చంద్రహాస్‌ దీనిపై శిక్షణ ఇచ్చాడు. యూసఫ్‌గూడాలోని ఎంజీఎం స్కూల్లో కిడ్నాప్‌పై క్లాసులు తీసుకున్నట్టు అఖిల ప్రియ పోలీసులకు చెప్పింది. ఇందుకోసం అక్షయ్‌ కుమార్‌ మూవీ స్పెషల్‌ ఛబ్బీస్‌ను తమ గ్యాంగ్‌ సభ్యులకు భార్గవ్‌, చంద్రహాస్‌ చూపించారు. అలాగే ఐటీ అధికారుల కాస్ట్యూమ్‌, ఐడీ కార్డుల వ్యవహారం మొత్తం చంద్రహాస్‌ చూసుకున్నాడు. శ్రీనగర్‌ కాలనీలోని ఒక సినిమా కంపెనీ నుంచి డ్రెస్సులను అద్దెకు తీసుకుని వ్యవహారాన్ని నడిపించారు. ఈ పిక్చర్‌ సమర్పణ భూమా అఖిలప్రియదేనని తేలింది. మరోవైపు రెండోరోజు పోలీస్‌ కస్టడీలో ఇలాంటి కీలక విషయాలు బయటపెట్టింది అఖిల. నిన్న ఉదయం 10 గంటలకు నుండి 5గంటల వరకు అంటే… దాదాపు 8 గంటల పాటు అఖిల ప్రియను ప్రశ్నించారు పోలీసులు. ప్రధానంగా కిడ్నాపర్లతో  మాట్లాడిన కాల్ డేటా తో పాటు సెల్‌టవర్ లొకేషన్ లకు సంబంధించిన ఆధారాల గురించి ప్రశ్నించారు. అయితే సమాధానం చెప్పకుండా కొన్ని… గుర్తు లేదని మరికొన్ని దాటవేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆమె భర్త భార్గవరామ్ ఎక్కడ ఉన్నాడన్నది ఆరా తీశారు. అలాగే ఏ2 సుబ్బారెడ్డికి ఈ కేసుకి ఉన్న సంబంధం పై కూడా ప్రశ్నించారు. అయితే చాలా ప్రశ్నలకు మౌనమే ఆమె సమాధానం అయింది. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకోగా… మిగిలినవారికి బెజవాడ, గోవా వెళ్లి పట్టుకున్నారు. ఇటు భార్గవ్, గుంటూరు శ్రీనివాస్‌తో పాటు మరికొందరి కోసం వేట సాగుతోంది. ఈ కేసులో అఖిల ప్రియ సోదరుడు జగత్ విఖ్యాత రెడ్డి ప్రమేయం కూడా ఉన్నట్టు గుర్తించారు.

Related posts