telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు స్థాయి మరచి మాట్లాడుతున్నారు: బొత్స

టీడీపీ ధినేత చంద్రబాబు పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు స్థాయి మరచి మాట్లాడుతున్నాడని విమర్శించారు. రాష్ట్ర విభజన వల్ల జరిగిన అన్యాయం కంటే.. గత ఐదేళ్లలో టీడీపీ దోపిడీ వల్లే ఎక్కువ నష్టం జరిగిందన్నారు. రాష్ట్ర ఖజానాను దోపిడీ చేసి దివాళా తీయించింది గత ప్రభుత్వమేనని ఆరోపించారు. టీడీపీ హయాంలో తప్పులు చేసిన చింతమనేనిపై ఒక్క కేసు అయినా రిజిస్టర్‌ చేశారా అని చంద్రబాబును ప్రశ్నించారు. కాల్‌మనీ కేసులో అభియోగాలు వచ్చిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు.

ప్రజలకిచ్చిన ప్రతి హామీని సీఎం వైఎస్‌ జగన్‌ నెరవేరుస్తున్నారని తెలిపారు. గ్రామ సచివాలయ వ్యవస్థ, కంటి వెలుగు పథకాలను తామే ముందు తీసుకొచ్చామని అబద్దాలు చెబుతున్న చంద్రబాబుకు కంటిచూపు మందగించినట్లుందని వ్యాఖ్యానించారు. అమరావతిలో తాత్కాలికంగా కట్టిన సచివాలయాన్నే చంద్రబాబు గ్రామ సచివాలయ వ్యవస్థ అనుకున్నారేమోనని ఎద్దేవా చేశారు. ప్రజల వద్దకే ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లేందుకే గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.

Related posts