తమిళ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం బోని కపూర్ నిర్మాణంలో “పింక్” రీమేక్ గా తెరకెక్కుతున్న “నెర్కొండ పార్వాయి” అనే చిత్రంలో నటిస్తున్నాడు. హెచ్ వినోథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, శ్రద్ధా శ్రీనాథ్, అభిరామి వెంకటచలం, ఆండ్రియా తరియంగ్లు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో లాయర్ పాత్రలో అజిత్ ఆకట్టుకుంటున్నాడు. వ్యభిచార గృహాల్లో చిక్కుకున్న ముగ్గురు యువతులను రక్షించే న్యాయవాది ఇతివృత్తంగా తమిళ నేటివిటీకి అనుగుణంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. “నెర్కొండ పార్వాయి” చిత్రంలో అజిత్ భార్యగా విద్యా బాలన్ నటిస్తుంది. విద్యాబాలన్ కు తమిళంలో ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. గిబ్రాన్ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. నీరవ్షా సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించారు. అధిక్ రవిచంద్రన్, అర్జున్ చిదంబరం, అశ్విన్ రావు, సుజిత్ శంకర్ ముఖ్య పాత్రలు పోషించారు. హిందీలో అమితాబ్ పోషించిన పాత్రను తమిళంలో అజిత్ చేశారు. ఆగస్టు 8న ఈ చిత్రం విడుదలకాబోతోంది. అజిత్ హీరోగా ఓ సినిమాను నిర్మించాలని శ్రీదేవి భావించేవారట. గతంలో శ్రీదేవి నటించిన “ఇంగ్లిష్ వింగ్లిష్” తమిళ వెర్షన్లో అజిత్ ప్రత్యేక పాత్ర చేశారు. ఆ సమయంలోనే అజిత్ హీరోగా ఓ సినిమాను నిర్మించాలని తన భర్త బోనీకి శ్రీదేవి చెప్పారట. ఆమెకిచ్చిన మాట ప్రకారం అజిత్ హీరోగా బోనీ ఈ సినిమాను నిర్మించారు. “నా భార్య శ్రీదేవి కోరికను నెరవేర్చగలిగాను. అజిత్, ఇతర సాంకేతిక నిపుణులు, నటీనటుల సహకారం లేనిదే ఇది సాధ్యమయ్యేది కాదు. దీన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాను” అని బోనీ ట్వీట్ చేశారు.
previous post
next post