క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. దీంతో ఆర్యన్ ఈరోజు రాత్రికి కూడా ఆర్ధర్ రోడ్డులోని జైలులోనే ఉండనున్నారు. అక్టోబర్ 3న అరెస్టయిన ఆర్యన్ ఖాన్.. దాదాపు రెండు వారాలకు పైగా జైలులో ఉంటున్నాడు.
కాగా..ఈ కేసులో ఉన్న మరో ఇద్దరు మనీశ్ రాజ్గరియా, అవిన్ సాహూకు బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 2న ఆర్యన్ ఖాన్తో పాటూ అరెస్టైన పలువురిలో వారిద్దరు కూడా ఉన్నారు. పార్టీకి వచ్చిన వారిలో మనీశ్, సాహూ కూడా అతిథులుగా ఉన్నారని ఎన్సీబీ చెబుతోంది.
ఆర్యన్ ఖాన్ అరెస్ట్ కేసులో మొత్తం 20 మందిని అదుపులోకి తీసుకుంది నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో. వారిలో ఇప్పుడు ఒడిషాకి చెందిన మనీశ్, సాహూలకు బెయిల్ లభించగా బాంబే హైకోర్టులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ విచారణలో ఉంది. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు జరగనుంది.
ఈ రోజు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్పై వాడి వేడి వాదనలు జరిగాయి. కుట్ర పూరితంగానే, ఎలాంటి ఆధారాలు లేకుండానే ఆర్యన్ను ఎన్సీబీ అధికారులు ఈ కేసులో ఇరికించారని మాజీ అటార్నీ జనరల్, ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
ఆర్యన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదని.. డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా వైద్య పరీక్షల ఆధారాలేవీ లేవన్నారు. మరి అలాంటప్పుడు ఆర్యన్ ఏవిధంగా సాక్ష్యాధారాలను ప్రభావితం చేస్తారన్నారు. తనతో పాటు కలిసి వచ్చిన ఓ వ్యక్తి వద్ద డ్రగ్స్ దొరికితే.. ఆర్యన్ను ఎలా అరెస్టు చేస్తారు? 20 రోజులకు పైగా ఎలా జైలులో ఉంచుతారు? అని ప్రశ్నించారు. అతడి వయస్సును దృష్టిలో ఉంచుకొని ఆర్యన్కు బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.
కాగా, డ్రగ్స్ రవాణాలో ఆర్యన్ పాత్ర ఉందని, అందువల్ల బెయిల్ ఇవ్వొద్దని, ఆర్యన్కు బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశముందని, విదేశాలకు పారిపోతాడని ఎన్సీబీ వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న బాంబే హైకోర్టు ఈ కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
హేమ వ్యాఖ్యలపై శ్వేతారెడ్డి ఫైర్… మీలాంటి వారికి అలవాటేమో…