మరోసారి సిరియా పేలుళ్లతో దద్దరిల్లింది. రెండు రోజుల క్రితం జరిగిన బాంబు పేలుడులో పది మంది మరణించిన ఘటన మరవక ముందే మరో కారు బాంబు దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో కనీసం 14 మంది మరణించగా.. 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరియా-టర్కీ సరిహద్దు రాష్ట్రం అలెప్పోలోని అజాజ్ నగరంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ ప్రాంతం టర్కీ విప్లవకారుల అధీనంలో ఉండడం గమనార్హం.
రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ఆదివారం సాయంత్రం మార్కెట్లన్నీ రద్దీగా ఉండడంతో సామాన్య ప్రజలే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు సమాచారం. కారులో అమర్చిన డిటోనేటర్లతో దుండగులు ఈ దాడికి పాల్పడ్డట్లు అధికారులు తెలిపారు. బాంబు ధాటికి సమీపంలో దుకాణాలన్నీ ధ్వంసమయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఇప్పటి వరకు ఈ దాడికి ఎవరూ బాధ్యత వహించలేదు. పేలుడు తీవ్రత భారీ స్థాయిలో ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం రఖ్కా నగరంలో ఇలాంటి దాడి ఒకటి చోటుచేసుకుంది. ఈ ఘటనలో పది మంది మరణించగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కుర్దిష్ నేతృత్వంలోని సిరియన్ డెమోక్రటిక్ ఫోర్స్ ఈ దాడికి బాధ్యత వహించింది.