telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడ్ స్టార్స్ అడుగులు టాలీవుడ్ వైపుగా…!!

Tollywood

పాన్ ఇండియా సినిమాల మేకింగ్ కి వేదికగా మారిన టాలీవుడ్ వైపుగా బాలీవుడ్ బడా స్టార్లు అడుగులు వేస్తున్నారు. తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో చాలా మంది హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ బడా స్టార్లు మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు. “మనం” మూవీలో తళుక్కున మెరిసిన అమితాబ్ బచ్చన్ పాన్ ఇండియా మూవీ “సైరా”లో చిరంజీవి గురువు పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఇక తెలుగు-హిందీ భాషల్లో తెరకెక్కిన “సాహో”లో తెలుగు వాళ్ళకంటే హిందీ ఆర్టిస్టులే ఎక్కువగా కనిపించారు. హీరోయిన్ గా శ్రద్ధాకపూర్, ప్రత్యేక పాత్రల్లో నీల్ నితిన్ ముకేశ్, జాకీష్రాఫ్, జాక్వలైన్ పెర్నాండెజ్ వంటి వారు నటించారు. ఇది పేరుకు హిందీలోనూ తీసినా హీరో, డైరెక్టర్ తో పాటు నిర్మాణ సంస్థ కూడా టాలీవుడ్ కి చెందినదే. ఇక ప్రభాస్ తాజా చిత్రం రాధే శ్యామ్ లో హిందీ సీనియర్ నటి భాగ్యశ్రీ నటిస్తున్నారు. ప్రభాస్, నాగ్ అశ్విన్ మూవీలో ఏకంగా స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే యాక్ట్ చేయడం మరింత సంచలనం. ఈ సినిమాలో నటించేందుకు దీపికకు భారీగానే పారితోషికం ఇస్తున్నారని టాక్. పవన్ -క్రిష్ విరూపాక్షలో జాక్వలైన్ ఫెర్నాండెజ్ ను ఓ పాత్రకు ఎంపిక చేసారని తెలిసింది. ఇవన్నీ ఒక ఎత్తయితే రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్ ‘ సినిమా మరో ఎత్తు. ఈ చిత్రంలో ఏకంగా ఇద్దరు బాలీవుడ్ బడా స్టార్లు నటిస్తున్నారు. ఎన్టీఆర్, చరణ్ పాత్రలకు కీలమైన గురువు పాత్రలో స్టార్ హీరో అజయ్ దేవగణ్, చరణ్ పక్కన హీరోయిన్ గా అలియాభట్ నటిస్తున్నారు. వీరిద్దరూ బాలీవుడ్ లో ఎంతో బిజీ యాక్టర్స్. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ తర్వాత సుజీత్ డైరెక్షన్ లో లూసిఫర్ రీమేక్ చేయనున్నాడు. ఇందులో లూసిఫర్ ఒరిజినల్ వెర్షన్ లో పృథ్వీరాజ్ పాత్రను తెలుగులో చేసేందుకు బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్ దత్ ఓకే చెప్పారని తెలుస్తోంది. అలాగే ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ‘అయినను పోయిరావలె హస్తినకు’ సినిమా లో ఓ ప్రాధాన్యమున్న రోల్ లో సంజయ్ దత్ ని నటింపజేసేందుకు త్రివిక్రమ్ ప్రయత్నిస్తున్నారని సమాచారం.

Related posts