telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గుండెపోటుతో ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత

Saroj Khan

ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆమె వయసు 71 సంవత్సరాలు. జూన్ 20న అనారోగ్యంతో ముంబయిలోని ఓ హాస్పిటల్‌లో చేరిన ఆమె… చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత పది రోజులుగా గురు నానక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సరోజ్ ఖాన్.. కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. నాలుగు దశాబ్దాల పాటు బాలీవుడ్‌తోపాటు దక్షిణాదిలో ఎన్నో చిత్రాలకు సరోజ్‌ఖాన్ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. 2,000కుపైగా పాటలకు నృత్యరీతులను సమకూర్చారు. ఉత్తమ కొరియోగ్రాఫర్ విభాగంలో మూడు సార్లు జాతీయ అవార్డులను అందుకున్నారు. 2002లో సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన ‘దేవదాస్’ చిత్రంలోని ‘డోలారే డోలా’, మాధురి దీక్షిత్‌కు ఎంతో పేరు తెచ్చిన తేజాబ్‌లో ‘ఏక్ దో తీన్ సాంగ్’, 2007లో కరీనా కపూర్ జబ్ వుయ్ మెట్‌లో ‘యే ఇష్కీ హాయా’ పాటలకు జాతీయ పురస్కాలు దక్కాయి. 80వ దశకంలో సరోజ్‌ఖాన్ హావా నడిచింది. ఎన్నో విజయవంతైన పాటలకు ఆమె నృత్యరీతులను సమకూర్చారు. అతిలోక సుందరి శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించిన నాగిని, మిస్టర్ ఇండియాలో పాటలకు సరోజ్ ఖాన్ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. 1974లో బాలీవుడ్ కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన సరోజ్ ఖాన్.. దాదాపు 50 ఏళ్లు పలు భారతీయ భాషా చిత్రాల్లో తన ప్రతిభను చాటుకున్నారు. సరోజ్ ఖాన్ నృత్య దర్శకత్వం వహించిన పలు సినిమాల్లోని కొరియోగ్రఫీకి 8 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు కైవసం చేసుకున్నారు. అంతేకాదు ‘వీరూ దాదా’, ‘ఖిలాడీ’ వంటి పలు చిత్రాలకు కథా రచయతగా పనిచేశారు. మరోవైపు పలు టీవీ ఛానెల్స్‌లో నిర్వహించే డాన్స్ రియాలిటీ షోస్‌కు ఆమె న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. గతేడాది కరణ్ జోహార్ నిర్మించిన ‘కళంక్’ ఆమెకు చివరి చిత్రం. ఇక, తెలుగులోనూ పలు సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన మృగరాజు సినిమాలో ఓ పాటకు సరోజ్ ఖాన్ డ్యాన్స్ రీతులను సమకూర్చారు.

Related posts