దంగల్ ఫేమ్ జైరా వాసిమ్ హఠాత్తుగా తాను సినిమా రంగం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించింది. దంగల్ చిత్రం తర్వాత జైరా మానసిక సమస్యలకు గురైనట్టు తెలుస్తోంది. అటుపై అనేక చిత్రాల్లో నటించినా, ఆమె వ్యక్తిగత జీవితం ఎప్పుడూ గందరగోళంగానే సాగింది. తాజాగా, జైరా వాసిమ్ చేసిన ప్రకటనతో ఆమె పరిస్థితి అందరికీ అర్ధమైంది. సినీ జీవితం కారణంగా మత విశ్వాసాలకు దూరమైన ఫీలింగ్ కలిగిందని, కెరీర్ కు, మతపరమైన నమ్మకాలకు పొసగదని అర్థం చేసుకున్నానని వివరించింది.
జైరా తాజాగా ద స్కై ఈజ్ పింక్ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ కూడా నటించారు. సినిమా రంగంలో తాను సులభంగానే ఇమిడిపోగలనని, కానీ, అదే సమయంలో దేవుడికి దగ్గర కాలేకపోతున్నానని, ఇలాంటి మానసిక సంఘర్షణలతో చిత్రపరిశ్రమలో కొనసాగడం కంటే నిజమైన ప్రశాంతత కోసం సినీ రంగానికిదూరంగా వెళ్లిపోవడమే మంచిదని నిర్ణయించుకున్నానని జైరా తెలిపింది. ఈ మేరకు ఫేస్ బుక్ లో పోస్టు పెట్టింది.