కరోనాను అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో ఆ సమయంలో చేతిలో పనిలేక, ఉపాధి కోల్పోయి సొంత గూటికి చేరలేక బిక్కుబిక్కుమంటున్న వలస కార్మికులను వారి వారి స్వరాష్ట్రాలకు చేర్చి ఆదుకున్నారు బాలీవుడ్ నటుడు సోనూ సూద్. దీంతో ఈయనపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. కాగా సోనూ సూద్ చేసిన ఈ మంచి పనిని విమర్శిస్తూ ఇటీవల శివసేన నేత సంజయ్ రౌత్, కాంగ్రెస్ నేత నగ్మా ఆయనను తప్పుబట్టారు. రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప మరో కారణమే లేదని విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలపై తాజాగా స్పందించిన సోనూ సూద్ షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. తన మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా కూడా ఇప్పటివరకూ పట్టించుకోలేదని, ఆ విమర్శల తాలూకు విషయాలు నా దగ్గర ఎవరైనా ప్రస్తావించినా కూడా.. మంచి పనులు చేసేటపుడు అలాంటివి సహజమే అని, అయినా నేను వలస కార్మికులను ఇంటికి చేర్చే పనిలో ఉన్నా కాబట్టి ఇప్పుడేమీ మాట్లాడలేను అని చెప్పేవాడిని అని సోనూ సూద్ చెప్పారు. మంచి ఆలోచనతో ప్రజలకు సేవ చేయాలని భావించినప్పుడు ఎంతో మంది వేలెత్తి చూపే ప్రయత్నం చేస్తుంటారని, అవే ఆ మంచి పనికి కొండంత బలాన్నిస్తాయని ఆయన అన్నారు. విమర్శలే తనకు స్ఫూర్తి అని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
previous post