బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్ రెడ్డి శనివారం కన్నుమూశారు. బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన పేగు క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు. ఈ నెల 10వ తేదీన ఆయన కేర్ ఆసుపత్రిలో చేరారు. మరణవార్త తెలిసిన వెంటనే బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా మూడు దఫాలుగా హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేసి బాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. హైదరాబాద్లో బీజేపీని బలోపేతం చేసిన వారిలో ఆయన ముఖ్యుడు. మైనారిటీ ప్రభావం ఉన్న ఏరియాలో కూడా ఆయన కాషాయజెండా ఎగరేయగలిగారు. అభిమానులు, పార్టీ అందరూ ఆయనను గోల్కొండ సింహం అని పిలిచేవారు.