కరోనా కారణంగా గణేశ్ చతుర్థి వేడుకలపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గణేశ్ విగ్రహ తయారీదార్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఈసారి వినాయకచవితి వేడుకలకు అనుమతి ఉంటుందా, లేదా అనేదానిపై అనిశ్చితి నెలకొనడంతో, విగ్రహ తయారీదార్లు ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారు. వినాయకచవితి వేడుకలపై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ సీఎంవోకు రాజాసింగ్ లేఖ రాశారు.
వినాయక విగ్రహాల తయారీదార్లు ఎంతో అయోమయానికి గురవుతున్నారని, వీలైనంత త్వరగా దీనిపై మార్గదర్శకాలు జారీ చేయాలని తెలిపారు. కనీసం 10 అడుగుల వినాయక విగ్రహాల తయారీకైనా అనుమతి ఇవ్వాలని అన్నారు. విగ్రహాల తయారీదార్లకు ఇదొక్కటే ఉపాధి కావడంతో వారిపై సానుభూతితో స్పందించి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.