ఏపీలో గత ప్రభుత్వ పాలనను భరించలేక ప్రజలు వైసీపీకి అధికారమిచ్చారని, అయితే ప్రజల విశ్వాసాన్ని వైసీపీ పొందలేకపోతోందని బీజేపీ నేత పురందేశ్వరి విమర్శించారు. కార్గిల్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విశాఖపట్టణంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న పీపీఏల రద్దు నిర్ణయం కరెక్టు కాదని ఆమె అన్నారు.
విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవినీతి జరిగితే సమీక్షించుకోవచ్చన్నారు. కాని వాటిని రద్దు చేయాలన్న సీఎం జగన్ నిర్ణయం సరైనది కాదని చెప్పారు. గోదావరి నదీ జలాల పంపకం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్ణయంగా చూడొద్దని చెప్పారు. ప్రజలు, రైతు సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమన ప్రకటనలు చేసినప్పటికీ సీఎం జగన్ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.