రాజు మారినప్పుడల్లా రాజధాని మార్చడం అంత తేలికైన విషయం కాదని బీజేపీ ఎంపీ సుజనా చౌదరీ అన్నారు. ఈ రోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై అనుమానాలున్నట్లు తెలిపారు. ఎన్నికల తర్వాత పరిపాలనపై దృష్టి పెట్టకుండా.. వ్యక్తిగత దూషణలపైనే సమయం వృథాచేస్తున్నారని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు.
ఏపీలో మూడు రాజధానుల కాన్సెప్ట్ పై కేంద్ర ప్రభుత్వం తగిన సమయంలో స్పందిస్తుదన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలే తప్ప రాజధానులు మార్చడం సరికాదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లే జీఎన్ రావు నేతృత్వంలోని కమిటీ నివేదిక ఇచ్చిందని ఆయన ఆరోపించారు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే.. రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.