రైతులకు మద్దతుగా చేపట్టిన ఉపవాస దీక్షను కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ విరమించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలపై మండిపడ్డారు. మంత్రుల మాటలు రైతులను కించపరిచేలా ఉన్నాయన్నారు. పంటను కేంద్రమే కొనుగోలు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని? ఆయన ప్రశ్నించారు.
టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు. ఆరేళ్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ క్వారంటైన్లో ఉన్నారు. కరోనా నియంత్రణ కోసం ప్రధాని చేసే ఫోన్ కాల్స్ను కూడా సీఎం తన ప్రచారానికి వాడుకుంటున్నారని అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. రైతులకు బీజేపీ అండగా ఉంటుందని సంజయ్ భరోసా కల్పించారు.