తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్-జగన్ గురువారం హైదరాబాద్ ప్రగతి భవన్లో సమావేశమైన సంగతి తెలిసిందే. వీరిద్దరి భేటీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా జరిగిన భేటీలో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి అడ్డుకట్ట వేయాలని చర్చించినట్లు పెద్ద ఎత్తున వార్తా పత్రికలు, టీవీ చానెళ్లలో ప్రత్యేక కథనాలు వస్తున్నాయి. ఈ కథనాలపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్, కేసీఆర్ ఎన్నిసార్లు భేటీ అయినా బీజేపీని ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. స్వప్రయోజనాల కోసమే వారిద్దరు కలుస్తున్నారని చెప్పారు.
ఉద్యమ సమయంలో ఒకలా.. అధికారంలోకి రాగానే మరోలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ మాయలఫకీర్ వేషాలతో ప్రజలను మోసగిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో నాటకాలు ఆడిన కేసీఆర్.. ఇప్పుడు కొత్త డ్రామా మొదలు పెట్టారని ఫైరయ్యారు. కేసీఆర్కు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. హైదరాబాద్ నగర్ చుట్టుపక్కల ఉన్న భూదందాలు బయటకు రాకుండా ఉండేందుకే కేసీఆర్ను జగన్ కలుస్తున్నారని విమర్శించారు.