కరోనా రాదనుకునే భావన ఎవరిలో ఉండొద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మహమ్మారి విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్ల కుటుంబాలకు కరోనా సోకుతోందన్నారు. కరోనా నివారణ కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కరోనా వైరస్కు ధనిక, పేద, గ్రామం, నగరం అనే తేడా ఏమీ లేదని, ముందస్తు జాగ్రత్తలే మనల్ని రక్షిస్తాయని చెప్పారు. ఇతర దేశాల్లో పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నామని చెప్పారు. తెలుగు ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా పాటించాలని కిషన్ రెడ్డి కోరారు.దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 15 లక్షల 24 వేల 266 మందికి స్క్రీనింగ్ చేశామని కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశంలో 492 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు.