మొన్నటి సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్రంట్ ఫ్రంట్ అన్నారని చివరికి ఏపీలో ఆయన టెంటే కూలిపోయిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జయవాడలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశానికి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూరాబోయే రెండేళ్లలో ఏపీ, తెలంగాణల్లో భారీ రాజకీయ ప్రకంపనలు తప్పవని జోస్యం చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఇకముందు ఆశ్చర్యకరమైన రీతిలో రాజకీయ పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు.
ఇప్పటికే ఏపీలో మాజీ సీఎం కుమారుడు, తెలంగాణలో సీఎం కుమార్తె ఓటమిపాలయ్యారని గుర్తుచేశారు.కాంగ్రెస్ తో జతకట్టిన కారణంగానే చంద్రబాబుకు ప్రజలు బుద్ధిచెప్పారని కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో గుణాత్మక మార్పు తెస్తానన్న కేసీఆర్ తన కుమార్తెను గెలిపించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. భవిష్యత్ లో ఏపీలో కూడా బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో త్రిపురలో ఒక్కశాతం ఓటింగ్ కూడా లేదని, ఇప్పుడా రాష్ట్రంలో తామే అధికారంలో ఉన్నామని చెప్పారు.