ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రక నిర్ణయం తీసుకున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ప్రధాని నిర్ణయాన్ని ఏపీలో జగన్ ప్రభుత్వం ఇప్పటికీ ఆమలు చేయడంలేదని ఆయన ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు కన్నా లేఖ రాశారు. ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలని కోరారు.
అగ్రకులాల పేదలకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందని కన్నా తన లేఖలో పేర్కొన్నారు. ఏపీలో ఈ రిజర్వేషన్లను అమలు చేయకపోవడం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన ఎంతోమంది అనేక అవకాశాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఉపాధి పొందలేకపోవడమే కాకుండా, ప్రముఖ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య అభ్యసించలేకపోతున్నారని వివరించారు. గవర్నర్ వెంటనే స్పందించి రాష్ట్రంలో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కన్నా విజ్ఞప్తి చేశారు.