కేసుల నుంచి తప్పించుకునేందుకే సీఏఏకు సీఎం జగన్ మద్దతిస్తున్నారని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. గుంటూరు నుంచి తుళ్లూరు వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. అమరావతి రైతులకు మద్దతుగా బీజేపీ శ్రేణులతో కలిసి ఆయన ర్యాలీ చేపట్టారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, ఏపీ రాజధాని అమరావతి అనే మాటకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. త్వరలోనే దీనిపై కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.
రాజధానిపై జగన్ తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మద్దతు ఇచ్చి సీఎం అయ్యాక మార్చుతామనడం విడ్డూరంగా ఉందని అన్నారు. జగన్ పాలన కక్షసాధింపుగా కనిపిస్తోందని కన్నా అభిప్రాయపడ్డారు. నవరత్నాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని, అన్ని చార్జీలను పెంచి పన్నులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ ఎత్తుకెళ్లినట్టుగా వైసీపీ పాలన ఉందని ఎద్దేవా చేశారు.