ఓట్ల కోసం రాజకీయ నేతలు రకరకాల ఫీట్లు చేస్తుండటం తెలిసిందే. అందులో భాగంగా కొందరు చీపుర్లు పట్టుకుని వీధులు చిమ్మితే, మరికొందరు కత్తెర-దువ్వెన పట్టుకుని కటింగ్ చేస్తుంటారు. మరికొందరేమో దోసెలు వేయడం, ఇడ్లీలు తీయడం వంటి పనులు చేస్తుంటారు. కానీ బీజేపీ అధికార ప్రతినిధి, ఒడిశాలోని పూరీ లోక్ సభ స్థానం నుంచి పోటీచేస్తున్న సంబిత్ పాత్ర మాత్రం కాస్త డిఫరెంట్. పూరీలో తెలుగువారి సంఖ్య గణనీయంగా ఉంది.
దీనితో అక్కడి తెలుగువారిని ఆకట్టుకోవడానికి సంబిత్ పాత్ర ఏకంగా మైక్ పట్టారు. బీజేపీ ఎన్నికల ప్రచార సభలో హీరో నాగార్జున-మనీషా కొయిలారా జంటగా నటించిన ‘క్రిమినల్’ సినిమాలో ‘తెలుసా-మనసా.. ఇది ఏనాటి అనుబంధమో’ అనే పాటను పాడేశారు. ఈ పాటకు సంబిత్ గొంతు చక్కగా సరిపోవడంతో మద్దతుదారులు, ప్రజలు ఈలలు, కేకలు వేస్తూ ఆయన్ను ప్రోత్సహించారు. ఈ వీడియోను మీరూ చూసేయండి. అసలు ప్రజలు సరిగా ఓటు వేయడం, నేతలు సరిగా పాలించడం లాంటివి జరిగితే( జరగవు అనుకోండి.. ఊరికే ఒకసారి అనుకోండి) ఈ తిప్పలు ఉండవు కదా! అయినా దీనిపై ప్రతిపక్షాలు స్పందిస్తూ, గెలవకపోతే పాటలు పాడుకొని బ్రతికేయొచ్చులే .. అంటూ కామెంట్లు కూడా జోరుగా చేసేస్తున్నారు.