తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పై కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. బుధవారం కరీంనగర్ బస్స్టేషన్ను సందర్శించిన సంజయ్.. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు తలసానిని గల్లీల్లో తరిమికొట్టే రోజులస్తాయని అన్నారు. ఆర్టీసీ కార్మికుల పట్ల అనుచితంగా మాట్లాడిన తలసాని శ్రీనివాస్యాదవ్ అంతటి మూర్ఖుడు ఎవరులేరని ఆయన వ్యాఖ్యానించారు.
అధికారంలో ఉన్నవారికి కొమ్ముకాసి మంత్రి పదవులు పొందే తత్వం తలసాని శ్రీనివాస్దని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్టీసీ విధుల్లో డ్రైవర్లు, కండెక్టర్లు అనారోగ్యం పాలవుతున్నా.. కుటుంబ పోషణ కోసం కష్టపడుతున్నారని తెలిపారు. కార్మికులు నెలరోజుల కిందటే సమ్మె నోటీస్ ఇచ్చినా సీఎం కేసీఆర్ వారిని అణగదొక్కాలని చూశారని విమర్శించారు. బీజేపీ నుంచి ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఉంటుందని చెప్పారు. ఆర్టీసీ సమ్మెతో కేసీఆర్ పతనం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ ఆస్తులను కబ్జా చేసి మల్టిఫ్లెక్స్లను నిర్మించుకునే కుట్రలో భాగంగానే సంస్థను ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.