తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన నాయకత్వంలో బీజేపీ ప్రతినిధి బృందం గవర్నర్ తమిళిసైని కలిసి ఒక వినతిపత్రం అందజేశారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారని విమర్శించారు.అక్రమ సంపాదన కోసం కాళేశ్వరం ప్రాజెక్టులో కొన్ని ప్యాకేజీలుగా విభజించి కొత్తగా టెండర్లను పిలిచారని ధ్వజమెత్తారు.
లాక్డౌన్ కొనసాగుతున్న సమయంలో నిబంధనలకు వ్యతిరేకంగా టెండర్లను పిలిచి సీఎం కేసీఆర్ దోచుకుంటున్నారని ఆరోపించారు. అలాగే, పాత ప్రాజెక్టులను కూడా కేసీఆర్ తన ఖాతాలో వేసుకుంటున్నారన్నారు. కేసీఆర్ నిర్వహిస్తున్న మీడియా సమావేశాలు అపహాస్యంగా మారయని అన్నారు. కేసీఆర్ బెదిరించి మీడియాను కంట్రోల్ చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ప్రాజెక్టులకు, అభివృద్ధి కార్యక్రమాలకు వ్యతిరేకం కాదన్నారు.