ఓ వ్యక్తి ట్రాఫిక్ రూల్స్ పాటించలేదని ఏకంగా రూ. 23వేలు ఫైన్. అక్షరాల ఇరవైమూడు వేలు అండి. ప్రభుత్వం నూతన మోటారు వాహన చట్టం సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజా ఫైన్స్ ప్రకారమే అతడికి వాయించేశారు. దినేష్ మదన్ అనే వ్యక్తి తన టూ వీలర్పై ప్రయాణిస్తున్నాడు. ఇంతలో గురుగ్రామ్ పోలీసులు అతడిని ఆపారు. దినేష్ను లైసెన్సు, ఆర్సీ తదితర పత్రాలు చూపించమని అడిగారు. అవి ఇంటి దగ్గర ఉండటంతో దినేష్ చూపించలేకపోయాడు. ఇంటికి వెళ్లి తీసుకువస్తానని పోలీసులను అడిగినప్పటికీ వారు అనుమతించలేదు.
అనంతరం పోలీసులు అతడికి లైసెన్సు, ఆర్సీ లేకపోవడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం, ఇన్సూరెన్సు లేకపోవడం తదితర కారణాలతో నిబంధనలను అతిక్రమించాడని రూ.23వేలు జరిమానా విధించారు. ఈ జరిమానాకు సంబంధించిన ఛలాన్ను చూసిన దినేష్ షాక్ అయ్యాడు. చివరకు చేసేదేం లేక సెకండ్ హ్యాండ్లో రూ.15వేలకు కొన్న తన ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలి వచ్చానని మీడియాకు వెల్లడించాడు.