బీహార్ ఎన్నికల వాయిదా పిటిషన్ పై సుప్రీం కోర్ట్ లో విచారణ జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసేలా సీఈసీనకి ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కరోనా రహిత రాష్ట్రంగా ప్రకటించేంత వరకు ఎన్నికలను నిర్వహించరాదంటూ బీహార్ కు చెందిన రాజేశ్ కుమార్ జైశ్వాల్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ఎస్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం ఈరోజు విచారించింది.
ఎన్నికల నిర్వహణపై సీఈసీదే తుది నిర్ణయమని తెలిపింది. అన్ని విషయాలను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుంటుందని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కోవిడ్ కారణంగా ఎన్నికలను వాయిదా వేయాలని తాము ఆదేశించలేమని తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారాల్లో తాము ఎలా జోక్యం చేసుకోగలమని ప్రశ్నించింది.