ఎన్నో అంచనాలతో జూలై 22న ప్రారంభమైన ‘బిగ్బాస్’ సీజన్ 3కు ఈ ఆదివారం (నవంబర్ 3న) శుభం కార్డు పడనుంది. అనేక మలుపులు, టాస్క్లతో వంద రోజులకు పైగా సాగుతున్న ‘బిగ్’ రియాల్టీ షో ఇది. 17 మంది సభ్యులు ‘బిగ్బాస్’ హౌస్లోకి అడుగుపెట్టారు. అయితే గతవారం శివజ్యోతి ఎలిమినేట్ కాగా, ఈ వారం ఎలాంటి నామినేషన్ ప్రక్రియలు ఉండవు. శ్రీముఖి, బాబా భాస్కర్, అలీరెజా, రాహుల్, వరుణ్ సందేశ్లు ఫైనల్కు చేరుకున్నారు. వీళ్లలో ఒకరికి మాత్రమే రూ. 50 లక్షలు గెలుచుకొనే అవకాశం ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజేత ఎవరనే దానిపై ప్రస్తుతం హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ‘బిగ్బాస్’ సీజన్ 1కి జూనియర్ ఎన్టీఆర్, సీజన్ 2కు నాని వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. తమదైన శైలిలో షోను రన్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచారు. ఇక మూడో సీజన్లో ప్రేక్షకులను అలరించడానికి, ఇంటి సభ్యుల్ని క్రమశిక్షణలో ఉంచడానికి ఎవరు అతిథిగా వస్తారా? అనే విషయం మీద రకరకాల ఊహాగానాలు వినిపించాయి. జూనియర్ ఎన్టీఆరే మళ్లీ ఆ బాధ్యత స్వీకరిస్తారని వార్తలొచ్చాయి. ఆ ఊహలకు తెర తీస్తూ వ్యాఖ్యాతగా నాగార్జున ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇంతకుముందు ‘మా’ టీవీ నిర్వహించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రామ్తో అందరినీ ఆకట్టుకొన్న నాగార్జున ‘బిగ్బాస్’ సీజన్ 3 వ్యాఖ్యాతగా ప్రారంభం నుంచే మంచి మార్కులు సంపాదించుకొన్నారు. తప్పు చేసిన ఇంటి సభ్యుల్ని మందలించారు. టాస్కుల్లో ప్రతిభ చాటిన వారిని అభినందించారు. ఎంతో హుందాగా ఈ షోను నిర్వహిస్తూ తన ప్రత్యేకత చాటుకుంటున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని వారూ ‘బిగ్ బాస్ 3’ షోను ఆసక్తికరంగా చూస్తున్నారంటే దానికి కారణం నాగార్జునే అంటున్నాయి ‘స్టార్ మా’ వర్గాలు. ‘బిగ్ బాస్ 3’ పుణ్యమాని ‘స్టార్ మా’ పాపులారిటీలో ఇప్పుడు దేశంలోనే మూడో స్థానంలో ఉందట. బీహార్కు చెందిన ‘దంగల్ టీవీ’ ప్రథమ స్థానంలో, తమిళనాడుకు చెందిన ‘సన్ టీవీ’ రెండో స్థానంలో ఉన్నాయి. ఒక తెలుగు ఛానల్ దేశవ్యాప్తంగా మూడో స్థానంలో ఉండడం చాలా అరుదైన విషయమని టాప్ 5, టాప్ 10 లో ఉండే ఛానల్ ఈ స్థాయికి రావడానికి కారణం ‘బిగ్ బాస్ 3’ అని ‘స్టార్ మా’ యాజమాన్యం చెబుతోంది. 1108 జీఆర్పీ (గ్రాస్ రేటింగ్ పాయింట్స్)తో ‘బిగ్బాస్ 3’ రియాల్టీ షో దూసుకుపోతోంది.
previous post