తెలుగు రియాల్టీ షో బిగ్బాస్-3 సీజన్ ఆదివారం రాత్రి సరిగ్గా 9:00 గంటలకు ప్రారంభమైంది. ఈ షో ఎన్నో వివాదాలు.. మరెన్నో పిటిషన్లు.. ఇంకెన్నో వార్నింగ్లు, నిరసనల మధ్య ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అంతేకాదు.. ఈ షోను ఆపాలని ఆఖరికి ఓయూ విద్యార్థుల సైతం అక్కినేని నాగార్జున ఇంటి ముందు ధర్నా చేసిన విషయం విదితమే. మొదట బిగ్బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున షో గురించి చెప్పుకొచ్చారు. అనంతరం కంటెస్టెంట్లను పరిచయం చేశారు. నాగార్జున హోస్ట్గా 15 మంది కంటెస్టెంట్స్తో వంద రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. తొలి రోజు నాగ్ తన మాటలతో షోని రక్తి కట్టించగా రెండో రోజు ఇంటి సభ్యులు తమ ఆటపాటలతో పాటు సరదా సంభాషణలతో ప్రేక్షకులని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ముందుగా ఇంట్లోకి ప్రవేశించిన ముగ్గురు రవిక్రిష్ణ, శివజ్యోతి, అషూ… ఆ తర్వాత వచ్చిన వారిని పలు ప్రశ్నలు అడగాలని బిగ్ బాస్ సూచించిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ చెప్పినట్టుగానే ఆ ముగ్గురు మిగతా కంటెస్టెంట్స్ని పలు ప్రశ్నలు అడిగారు.
అయితే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం 12 మంది ఇంటి సభ్యులలో ఎవరైతో సరైన సమాధానం ఇవ్వలేదని రవిక్రిష్ణ, శివజ్యోతి, అషూకి అనిపిస్తుందో వారిని నామినేట్ చేయొచ్చని పేర్కొన్నాడు. ఆదేశానుసారం ఆ ముగ్గురు ఆలోచించి రాహుల్, వరుణ్, బాబా భాస్కర్, వితిక, శ్రీముఖి, జాఫర్ని నామినేట్ చేశారు. దీంతో ఈ ఆరుగురు ఎలిమినేషన్లో ఉన్నట్టు తెలిపారు బిగ్ బాస్. అయితే ఎలిమినేషన్ నుండి తప్పించుకోవడానికి బిగ్ బాస్ ఓ అవకాశం ఇచ్చారు. అందుకుగాను ఓ మానిటర్ని ఎన్నుకోవాలని ఆ ఆరుగురికి సూచించారు. దీంతో వారు హేమని ఎన్నుకున్నారు. హేమ పర్యవేక్షణలో ఈ ఆరుగురు నామినేషన్ నుండి తప్పించుకోవడానికి టాస్క్లోకి దిగారు. నామినేట్ అయిన వారు మిగిలిన హౌస్మేట్స్ నుండి ఓ వ్యక్తిని ఎంపిక చేసుకొని సరైన కారణాలతో వారిని నామినేట్ చేయొచ్చనే చిన్న ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. అయితే అవతలి వారు కూడా తను చెప్పాలనుకున్నది చెప్పొచ్చని బిగ్ బాస్ పేర్కొన్నారు. కాకపోతే ఇక్కడ తుది ఫలితం అనేది మానిటర్గా వ్యవహరిస్తున్న హేమదే అని తేల్చేశారు. నేటి ఎపిసోడ్లో నామినేషన్ లిస్ట్లో ఫైనల్గా ఎవరు ఉంటారనేది తెలుస్తుంది.